దోమలగూడ: నీటి ట్యాంక్లో మృతదేహం కలకలం రేపిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గొల్కొండ చౌరస్తా సమీపంలోని రిసాలగడ్డ వద్ద ఉన్న మంచినీటి ట్యాంక్ను వాటర్వర్క్ సిబ్బంది మంగళవారం శుభ్రం చేస్తుండగా, అందులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది.
దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసారు. అయితే మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో, వ్యక్తి ఎవరు అనేది గుర్తు పట్టలేక పోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు.
ఇదిలా ఉండగా పోలీసులు నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి, మృతుడి ఫొటోను అన్ని స్టేషన్లకు పంపించారు. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తునట్లు సమాచారం. మంచినీటి ట్యాంక్లో మృతదేహం ఉందని తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.