వెంగళరావునగర్ : నవమాసాలు మోసి..కని పెంచి పెద్ద చేసింది. వివాహం చేసి కూతుర్ని అత్తవారింటికి పంపింది. ముగ్గురు బిడ్డలకు తల్లయ్యాక..ఆమె భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా భర్తకు దూరమైన.. కూతురి కష్టాలను చూసి చలించి.. బిడ్డతో పాటు ఆమె ముగ్గురు పిల్లల్ని చేరదీసింది ఆ వృద్దురాలు.
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి కూతురితో పాటు ఆమె ముగ్గురు బిడ్డల్ని పెంచి పోషించింది. అలాంటి తల్లిపై కృతజ్ఞతగా ఉండాల్సిన కుమార్తె ఆమెపాలిట శాపంగా మారింది. తల్లి ఆస్తిపై కన్నేసిన కూతురు నిద్రిస్తున్న తల్లి తలపై ఇనుపరాడ్డుతో మోదింది.
గుండెలపై ఆడించిన మనవరాలే గుండెలపై కూర్చొని..దవడలపై కొట్టి అమ్మమ్మ పళ్లూడగొట్టింది. ఆ వృద్దురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు వారినుంచి ఆమెను రక్షించారు. ఈ అమానవీయ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అంకమ్మబస్తీలో చోటుచేసుకుంది.
అమీర్పేట్ మైత్రీవనం సమీపంలోని అంకమ్మబస్తీలో ఏడు పదుల వయస్సున్న యామల నాగమ్మ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో పూరి గుడిసె వేసుకుని నివాసముంటుంది. వృద్దురాలు నాగమ్మకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇళ్లల్లో పాచిపనులు చేసి కుమారుడు, కూతురికి పెళ్లిళ్లు చేసి బాధ్యతల్ని పూర్తి చేసుకుంది.
కుమారుడు అతని కుటుంబంతో బోరబండలో నివాసముంటున్నాడు. పెళ్లైన కూతురు పార్వతికి కొండ, అంజమ్మ, అంకమ్మలనే ముగ్గురు పిల్లలు కలిగాక భర్త వదిలేశాడు. తల్లి వారిని చేరదీసి ఆశ్రయం కల్పించింది.అయితే ఆ పట్టా భూమిని తన పేరిట రాయాలని కూతురు పార్వతి, ఆమె ముగ్గురు పిల్లలు ఒత్తిడి చేసేవారు. అందుకామె నిరాకరించింది.
ఆమె ఆస్థి ఇవ్వకపోవడంతో కూతురు ఆమెపై కక్షగట్టింది. అందుకు ఆమె ముగ్గురు పిల్లలు తోడయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లి తలపై ఇనుపరాడ్డుతో మోదింది. మనుమరాలు అంజమ్మఅమ్మమ్మ గుండెలపై కూర్చొని ఆమె దవడలపై దాడి చేయడంతో వృద్దురాలి రెండు పళ్లూడిపోయాయి.
ఆమె అరుపులు విని స్థానికులు ఆమెను వారి బారినుంచి కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తర్వాత వచ్చిన వృద్దురాలిని ఇంట్లోకి రానీవ్వలేదు. దాంతో రోడ్డుపైనే ఉంటూ ఆకలిదప్పులతో అలమటిస్తోంది. వృద్దురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.