వెంగళరావునగర్ : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్యను నయం చేస్తామంటూ ఓ ఉద్యోగిని నమ్మించిన ఆగంతకులు రూ.1.14 లక్షలను కొట్టేసి బిచాణా ఎత్తేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఈ తరహా రెండో మోసానికి సంబంధించి కేసు నమోదు కావడం గమనార్హం.
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..సనత్ నగర్ లోని జెక్కాలనీకి చెందిన బి.శివకుమార్ బీడీఎల్లో ఉద్యోగం చేస్తున్నాడు. మూసాపేట సమీపంలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన శివకుమార్ గత సంవత్సరం సెప్టెంబరు 18న మూసాపేటకు తన బైక్ పై తిరిగి వస్తున్నాడు.
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలోకి చేరుకున్న తరువాత పక్కనే మరో ద్విచక్ర వాహనం పై భార్యాభర్తలుగా చెప్పుకున్న ఇద్దరు శివకుమార్ను పలకరించారు. శివకుమార్ కాలుకు బ్యాండెడ్లు చుట్టి ఉండటంతో నరాల సమస్య ఉన్నట్లు గుర్తించి బైక్ పై ఉన్న పరుశురాం అనే వ్యక్తి మెల్లగా మాట కలిపాడు.
తన మిత్రుడి తండ్రికి ఇదే తరహా సమస్య ఉండేదని తక్కువ ఖర్చుతో ఓ ఆయుర్వేద వైద్యంతో బాగయ్యిందని నమ్మబలికాడు. శివకుమార్ వద్ద ఫోన్ నెంబరు తీసుకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు అనిల్ అనే వ్యక్తి శివకుమార్కు ఫోన్ చేశాడు.
తన తండ్రికి కూడా ఇదే తరహా సమస్య ఉండటంతో ఆయుర్వేద మందుతో బాగయ్యిందని, మందు తయారు చేసే విధానం ఇంటికి వచ్చి చెపుతానన్నారు. మరుసటి రోజు జెక్కాలనీలోని శివకుమార్ ఇంటికి అనిల్ వచ్చాడు. రూ.500 ఖర్చు చేయించి కొబ్బరికాయలు, బాదం, రోజ్ ఫ్లవర్, పసుపు, యాలకులు తదితర మిశ్రమాలను చేయించాడు.
అయితే ఈ మిశ్రమంలో కొన్ని ఆయుర్వే వనమూలికలు కూడా కలిపితే పూర్తి ఔషధం తయారవుతుందని చెప్పాడు. వనమూలికలు వెంగళరావునగర్లోని ఓ దుకాణంలో లభిస్తాయని చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి మరుసటి రోజు వెంగళరావునగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక దుకాణానికి తీసుకుపోయాడు.
దుకాణంలో ఆనంద్, ఆనందప్పలతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. మాయ మాటలు చెప్పి, ఒత్తిడి చేసి లక్షా 14 వేల 365 రూపాయలు తీసుకుని ఏవో మాలికలు అంటగట్టారు. మందు పనిచేయకపోతే డబ్బు తిరిగి ఇస్తామంటూ నకిలీ చెక్కులను కూడా శివకుమార్కు ఇచ్చారు.
మూడు నెలలు వాడినప్పటికీ తన కాలు బాగు కాకపోవడంతో అనుమానం వచ్చిన శివకుమార్ రెండు రోజుల క్రితం మూలికలు కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి చూస్తే దుకాణం ఖాళీ చేసినట్లు తెలిసింది. చుట్టుపక్కల విచారించగా కేవలం ఒక నెల మాత్రమే ఉండి ఖాళీ చేశారని తెలయడంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.