వికారాబాద్ : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వికారాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని మైలార్దేవరంపల్లి గ్రామానికి చెందిన కొమ్మని యాదయ్య కుమారుడు వెంకటయ్య(22) హైదరాబాద్లో పని చేస్తూ జీవనం సాగించేవాడు. గతేడాది ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని పెండ్లి చేసుకుంటానని ఆరు నెలల క్రితం తన తల్లిదండ్రులతో చెప్పాడు. వెంకటయ్య తల్లిదండ్రులు అమ్మాయి తరుపువారిని అడగడంతో వారు పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య గతంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను ఇష్టపడిన అమ్మాయి తనను పెండ్లి చేసుకోదని మరోసారి అక్టోబర్ 1న సాయంత్రం 5:30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఆచూకీ కోసం వెతుకుతుండగా శనివారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ఏరియా దవాఖానకు తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.