కుమ్ర౦ భీం ఆసీఫాబాద్ : తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతంలో నిన్న గల్లంతైన ప్రతాప్ చౌదరి (17) అనే వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైందని తిర్యాణి ఎస్సై రామారావు తెలిపారు. ప్రతాప్ చౌదరి తన స్నేహితులతో కలిసి చింతల మదర జలపాతం అందాలను చూడడానికి రాగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతయ్యాడు. తన తోటి స్నేహితులు తమకు తెలపగానే నిన్న సాయంత్రం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
చీకటి పడడంతో నిన్న సాయంత్రం గాలింపు చర్యలు నిలిపి వేసి తిరిగి సోమవారం ఉదయం ప్రారంభించగా జలపాతంలో ప్రతాప్ చౌదరి మృతదేహం లభ్యమైంది ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.