మైత్రేయ మహర్షి విదురునికి ‘కపిల-దేవహూతి’ సంవాదం వినిపిస్తున్నాడు. దేవహూతి ధృతమతి అనగా, పరమాత్మ యందు సుదృఢంగా సంలగ్నమైన సద్బుద్ధి కలిగిన సతీసాధ్వి-మహాపతివ్రత. ‘సా బుద్ధిః విమలేందు శంఖ ధవళా యా మాధవ వ్యాపినీ’- పరమాత్మ యందు పరివ్యాప్తమైన, కళంక రహితుడైన చంద్రుని వంటి మరియు శంఖం లాంటి తెల్లనైన బుద్ధే వాస్తవమైన బుద్ధి. ‘పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి’- అని బాల ప్రహ్లాదునిచే బమ్మెర పోతన
పలికించిన సూక్తి.
దేవహూతి కపిలునితో వినయ పూర్వకంగా ఇలా విన్నవించుకుంది- మహానుభావా! ఈ దేహ-గేహా (గృహా)దులలో నాకు ఏర్పడిన ‘నేను-నాది’ అనే దురాగ్రహం నువ్వు కల్పించింది, కల్గించిందే కదా స్వామీ! కాన ఈ మహా మోహాన్ని నువ్వే తొలగించాలి. ప్రకృతి- పురుష జ్ఞాన ప్రాప్తికై పురుషోత్తముడవైన నిన్ను ప్రపత్తి-శరణాగతి చేస్తున్నా.
తల్లి మనసులోని మర్మం గ్రహించిన కపిలుని హృదయం మాతృప్రేమతో పరవశించింది, పరవళ్లు త్రొక్కింది. ‘ఈ మాతృమూర్తి తన శరీర సారం- స్తన్యం నాకు తాగించింది. నా జీవన సారం- సాంఖ్య తత్తం ఈమెకు అనుగ్రహించాలి’ అని భగవానుడు భావించాడు. కపిల గీతలో మొట్టమొదటే మౌలికమైన ముచ్చటైన మహా మంచిమాట- అమ్మా! చిక్కులతో కూడిన గాఢమైన- చిక్కని సంసార బంధానికి, చక్రి (విష్ణు) చింతతో కూడిన చక్కని మోక్ష పురుషార్థానికీ మానవుని చిత్తమే- మనసే కారణం. అది సత్తరజస్తమో గుణాలతో సమ్మిళితమైతే సంసార సంసరణానికి- జనన, మరణ ప్రవాహ పతనానికి ప్రబలమైన హేతువవుతుంది. అలా కాక, అది సర్వేశ్వరుని యందు సంసక్త-ఆసక్తమైతే సులభ సంసార సంతరణానికి- తరించడానికి కారణమవుతుంది.
‘బంధాయ విషయా సక్తం’- విషయాసక్తి బంధకం. ‘ముక్యై నిర్విషయం మనః’- విషయ విరక్తి మోక్షదం. ఇది వినటానికి ఎంతో వింతగాను, లేశమంత కూడా నమ్మశక్యం కానిదిగాను ఉన్నా, అన్ని శాస్ర్తాలు దీనికే వంత పాడుతున్నాయి. ‘యో బంధకః స ఏవ మోచకః’ బంధించేదే విడిపిస్తుంది. తాళం వేసినా తీసినా ఒకే చెవి (కీ)తోనేగా, ఎక్కడా రెండు చెవులు లేవుగా! ప్రబలమైన గాలిచే తేబడిన మేఘాలు మరల దాని చేతనే ఎగుర గొట్టబడుతున్నట్లు మనసుచే కల్పితమైన బంధం తొలగాలంటే మనసే ప్రయత్నించాలి.
అమ్మా! పరమాత్మ యందు ఆనందమొక్కటే- ఆనందో బ్రహ్మ! ప్రపంచం సుఖదుఃఖాది ద్వంద్వమయం. సత్యమైన ఆత్మను మరచిన జీవునికి దేహమే తాననే భావ మేర్పడ్డది. దేహమే తానని భావించుట వల్ల ఆ దేహ సంబంధులంతా తన వారనే భావన ప్రబలింది. ఈ అహంకార మమకారాలే అన్ని అనర్థాలకు కారణాలు. మమకారం పెట్టుకున్న వారిని అమితంగా ప్రేమిస్తాం. ఇదే కామం! వారిని వదలుకోవడానికి ఎట్టి పరిస్థితిలో కూడా సమ్మతించం. ఇదే లోభం! ప్రియమైన ఈ మన ప్రవర్తనకు ప్రతిబంధకం- అడ్డు తగిలే వారిపై క్రోధం! – ఈ మూడూ నరకానికి ద్వారాలని గీతలో భగవద్వాణి.
షడ్దర్శనాలలో సాంఖ్య దర్శనం ప్రవచించిన కపిలుడు వేరు. ఆ కపిలుని సాంఖ్య దర్శనం నిరీశ్వరం. కపిల భగవానుని సాంఖ్య అనగా ‘శుద్ధ ఆత్మ తత్త విజ్ఞానం’ భక్తి ప్రధానం. భక్తి ప్రవర్ధకం కూడా. ఈ తత్త విజ్ఞానం బోధించమని తల్లి దేవహూతి శరణాగతి చెయ్యగా కపిలుడు ఇలా ఉపదేశించాడు- అమ్మా! అంతిమంగా ముక్తి నిచ్చేది అధ్యాత్మ యోగమే. కర్మ ఉపాసనలు కావు. సంసారంలో స్వజనులతో పెట్టుకున్న సంపర్కమే- మమత్వమే బంధనం. ఆ ఆసక్తినే సుజనులందు (సాధు సంతులు) చూపిన మోక్షద్వారం తెరుచుకుంటుంది. తల్లీ! దృశ్య వర్గమంతా ప్రకృతి. జడం. దానికి పరమై వెలుగునిచ్చే చైతన్య స్వరూపుడే పురుషుడు. చైతన్యం- తెలివి, ఎఱుక- స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు అతీతం. అట్టి చైతన్య రూప ఆత్మను భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా దర్శించు. జ్ఞాన వైరాగ్యాలకు జనని భక్తి. భగవదర్పితమైన భక్తి మార్గమే ఉత్తమోత్తమం.
‘అనిమిత్తా భాగవతీ భక్తిః ముక్తే ర్గరీయసీ’ – సహజమూ, నిష్కామమూ అయిన భగవత్సేవా రూప భక్తి ముక్తికంటే గొప్పది. ఫలాపేక్ష లేకపోవడమే భక్తిలోని వాస్తవ సుఖం. ఫలాపేక్ష ఉంటే ప్రేమ లేదని అర్థం- ఉన్నా అది దేవుని యందు కాక తాను ఆశించిన ఫలంలోనే ఉన్నట్టు కదా! అనగా, భగవదారాధన ఆ ఫలప్రాప్తికి ఒక ద్వారం మాత్రమే అయిందన్నమాట! ఇది శుద్ధ భక్తి కాదు. నిష్కామ భక్తే భాగవత భక్తి- పరాభక్తి! ఇది మహా శక్తిమంతం. తిన్న అన్నాన్ని జఠరాగ్ని అప్రయత్నంగా జీర్ణింప జేసినట్లుగా, ఈ భక్తి లింగ శరీరాన్ని- మనస్సును అనగా పుణ్యాపుణ్య కర్మవాసనా కోశాన్ని భస్మం గావిస్తుంది. జననీ!
నా ఏకాంత భక్తులు సాయుజ్య ముక్తిని కూడా తృణప్రాయంగా భావిస్తారు. వారు సర్వదా తమ సమస్త కర్మ ఫలాలను నాకే అర్పించి భక్తి పరవశులై మోక్షం మీద అపేక్ష లేకుండా ఉంటారు.
(సశేషం)
చ.అమలిన భక్తి గొందఱు మహాత్ములు మచ్చరణార వింద యు గ్మము హృదయం బునన్ నిలిపి కౌతుకులై యిత రేతరాను లా పముల మదీయ దివ్యతను పౌరుషముల్ గొనియాడుచుండి మోక్షము మది గోరనొల్ల రనిశంబు మదర్పిత సర్వ కర్ములై.
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006