భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో స్నేహితుడిని అంతం చేసిన జంట ఆపై పుర్రెను ఇంట్లోనే దాచడం కలకలం రేపింది. మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టిన జంట పుర్రెతో ఇతరులను బెదిరిస్తున్నారు. నిందితుడు బబ్లూ తాగిన మైకంలో మే 23న పుర్రెతో తిరుగుతూ స్ధానికులను బెదిరించాడని హబీబ్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీఎస్ ప్రజాపతి తెలిపారు.
తన స్నేహితుడు శివదత్ భలేరావును తాను హత్య చేశానని, అతడి పుర్రె ఇదేనంటూ తాగిన మైకంలో బబ్లూ స్ధానికులతో చెప్పాడని పేర్కొన్నారు. గతంలో తాను హత్య చేశానని బబ్లూ తరచూ స్ధానికులను బెదిరిస్తుండేవాడని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2021 అక్టోబర్లో ఈ హత్య జరిగింది. దాదాపు 12 గంటల పాటు నిందితుడు చెప్పిన స్ధలంలో తవ్వి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. తన గర్ల్ఫ్రెండ్తో బాధితుడు వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో ఈ హత్య చేశానని నిందితుడు పోలీసుల ఇంటరాగేషన్లో అంగీకరించాడు.
లవర్ సమక్షంలోనే నిందితుడు బాధితుడిని కత్తితో పొడిచి చంపాడు. ఆపై వారిద్దరూ ఇంటిలో గుంట తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు బబ్లూ అతడి ప్రియురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.