బంజారాహిల్స్ : కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకునేందుకు ముంబయి నుంచి వచ్చిన ఓ యువకుడికి కళ్లముందు లక్షల రూపాయలు కనిపించేసరికి ఆశ కలిగింది. దాంతో ఎవరూ చూడని సమయం చూసి డబ్బులు కాజేశాడు.
అయితే కాసేపటికి డబ్బులు పోయిన విషయాన్ని గుర్తించిన యజమాని అందరి జేబుల్లో సోదాలు చేస్తుండడంతో కంగారు పడి తాను కొట్టేసిన డబ్బు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో బాత్రూమ్లోకి వెళ్లి టాయ్లెట్లో పడేశాడు. కొంతడబ్బు అతడి జేబులో మిగిలిపోవడంతో కటకటాలపాలయ్యాడు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయికి చెందిన షేక్ చాంద్ రజాక్ 4రోజుల క్రితం క్యాటరింగ్ పనుల కోసం నగరానికి వచ్చాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 18లో నివాసం ఉంటున్న వ్యాపారి ప్రకాష్చంద్ జైన్ ఇంట్లో దీపావళి సందర్బంగా ఈనెల 1న రాత్రి బంధుమిత్రులతో లక్ష్మీపూజ నిర్వహించారు.
ఈ పూజ సందర్భంగా ఫుడ్ సప్లయ్ కోసం ఓ క్యాటరింగ్ సంస్థను సంప్రదించగా 18మంది క్యాటరింగ్ బాయ్స్ను పంపించారు. వారిలో ముంబయినుంచి వచ్చిన షేక్ చాంద్ రజాక్ కూడా ఉన్నాడు. కాగా లక్ష్మీపూజలో సుమారు మూడున్నర లక్షల నగదును వ్యాపారి ప్రకాష్ చంద్ జైన్ కుటుంబ సభ్యులు పెట్టారు.
పూజ పూర్తయిన తర్వాత అందరూ భోజనం చేసే హడావుడిలో ఉండగా లక్ష్మీదేవి ఎదురుగా పెట్టిన నగదుపై కన్నుపడిన షేక్చాంద్ రజాక్కు ఆశపుట్టింది. ఎవరూ చూడకుండా డబ్బు తీసుకుని జేబుల్లో పెట్టుకున్నాడు. కాసేపటికి డబ్బులు పోయిన విషయం గుర్తించిన ప్రకాష్చంద్ జైన్ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.
ఇంట్లో పనిచేస్తున్న వారిని ఆరా తీస్తుండడంతో తాను పట్టుపడడం ఖాయమని బావించిన రజాక్ తనజేబులో ఉన్న సుమారు రెండున్నర లక్షల నగదు తీసి బాత్రూమ్లో కమౌడ్లో వేయడంతో పాటు నీటిని ఫ్లష్ చేశాడు. రూ.75వేల డబ్బును జేబులో పెట్టుకున్నాడు.
కాసేపటికి సోదా చేయగా జేబులో నగదు గుర్తించిన యజమాని ప్రశ్నించగా డబ్బులు బాత్రూమ్లో వేసిన విషయాన్ని చెప్పాడు. దాంతో అక్కడ తనిఖీ చేయగా మూడునాలుగు నోట్లు మాత్రమే తేలగా మిగిలినవన్నీ డ్రైనేజీలో కలిసిపోయా యి. బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడు రజాక్ను అరెస్ట్ చేశారు.