లక్నో: స్కూల్ బస్సు నుంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోదీనగర్ పట్టణానికి చెందిన మూడో తరగతి విద్యార్థి ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్తున్నాడు. అయితే బస్సు విండో నుంచి తల బయటకు పెట్టి చూస్తున్నాడు. ఇంతలో రోడ్డు పక్కగా ఉన్న ఒక స్తంభం బలంగా విద్యార్థి తలకు తగిలింది. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులను స్కూల్కు యాజమాన్యం పిలిపించింది. విద్యార్థి ఆరోగ్యం బాగోలేదని, బస్సు నుంచి వాంతులు చేసుకున్నట్లు చెప్పింది. అయితే స్కూల్కు వెళ్లేటప్పుడు తన కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడని విద్యార్థి తండ్రి అంకుర్ నెహర్ తెలిపాడు. స్కూల్ యాజమాన్యం చెప్పేదంతా అబద్ధమని ఆరోపించాడు. నిర్లక్ష్యం వల్ల తన కుమారుడి మరణానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమండ్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.