లక్నో: ఒక గుడిలోని పురాతన విగ్రహాలను చోరీ చేసిన దొంగలకు పీడ కలలు వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఆ దొంగలు ఆ విగ్రహాలను తిరిగి ఇచ్చారు. ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో జరిగింది. ఈ నెల 9న రాత్రి వేళ తరౌన్హాలోని పురాతన బాలాజీ ఆలయంలోని కోట్ల విలువైన 16 అష్టధాతు విగ్రహాలను దొంగలు చోరీ చేశారు. దీంతో మహంత్ రాంబాలక్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే చోరీకి గురైన 16 విగ్రహాల్లో 14 విగ్రహాలు ఆదివారం పూజారి రాంబాలక్ నివాసం వద్ద ఒక సంచిలో కనిపించాయి. అందులో ఒక చీటీ కూడా ఉంది. ఎనిమిది లోహాలతో తయారైన దేవతా విగ్రహాలను చోరీ చేసినప్పటి నుంచి తమకు భయానక పీడ కలలు వస్తున్నాయని దొంగలు అందులో రాశారు. దీంతో వాటిని తిరిగి ఇచ్చేసినట్లు ఆ చీటీలో పేర్కొన్నారు. కాగా, ఈ విగ్రహాలను సదర్ కొత్వాలి కర్వి పోలీస్ స్టేషన్లో స్వాధీనపర్చినట్లు పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ సింగ్ తెలిపారు. అష్టధాతు విగ్రహాల చోరీపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.