సికింద్రాబాద్ : సాబూ కార్స్ సంస్థ వర్కింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సాబూపై కార్కానా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు కాగా బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. సీఐ రవీందర్ కథనం ప్రకారం సికింద్రాబాద్ లోని సిఖ్విలేజ్లో నివసించే కె. వీరేందర్రెడ్డి కూడా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్గా ఉన్నారు.
జూలై నెల నుంచి రెండు కార్లకు సంబంధించిన రుణాలు కట్టడం లేదని, ఏఎస్ రావ్ నగర్కు చెందిన సుందరం ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తన ఇంటికి వచ్చారన్నారు. దీంతో షాక్కు గురైన అతను తాను ఎటువంటి కారు లోన్లు తీసుకోలేదని సదరు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులకు తెలిపాడు.
మారేడుపల్లికి చెందిన ప్రశాంత్ సాబూ అనే వ్యాపారి మీ గ్యారంటి సంతకంతో రెండు కార్లలోన్లు రూ. 40లక్షలు తీసుకున్నాడని సిబ్బంది తెలిపారు. దీనికి సంబందించి వీరేందర్రెడ్డి సంతకాలతో కూడిన లోన్ డాక్యుమెంట్లను చూపించారు.
ఈ విషయంలో తాను మోసపోయినట్లు గ్రహించిన వీరేందర్రెడ్డి ఈ నెల 16 న తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కార్కానా పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ సాబూపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ సాబూను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.