సికింద్రాబాద్ : సీతాఫల్మండిలో వృద్దురాలి మెడలోంచి బంగారు గొలుసును అపహరించిన చైన్స్నాచర్ను 24 గంట ల్లోపే చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం ఓ అపార్ట్మెంట్లో పనులు చేసేందుకు వెళ్తున్న వృద్దురాలి మెడ నుంచి చైన్ను తెంపుకుని పారిపోయిన స్నాచర్ను సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాల్ మాస్కే(24) భార్య హైదరాబాద్ వాసి కావడంతో ఈనెల 20న యశ్వంత్పురా రైలులో కాచిగూడలో దిగాడు. రైలు దిగగానే కాచిగూడలో యూనికార్న్ బైక్ను దొంగలించాడు. అనంతరం మంగళవారం సీతాఫల్మండిలోని వారాసిగూడ బ్రాహ్మణబస్తీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్దురాలిని అనుసరించాడు. అపార్ట్ మెంట్లోకి వెళ్లిన సమయంలో లిఫ్ట్ వద్ద వృద్దురాలి మెడ నుంచి 7.2 గ్రాముల బంగారు గొలుసును తస్కరించాడు.
అనంతరం అక్కడి నుంచి ఓ బంగారు దుకాణంలో చైన్ను తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో బంగారం తాకట్టు పెట్టుకున్న దుకాణ యజమాని మనీష్కుమార్ జైన్తో పాటు నిందితుని వద్ద నుంచి 7.2 గ్రాముల బంగారు గొలుసు, యూనికార్న్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు.