బంజారాహిల్స్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ యువకుడు పోలీసులకు తనపేరును తప్పుగా చెప్పడంతో పాటు బంధువుపేరుతో ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చి తప్పుదోవ పట్టించడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నారాయణగూడ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆగస్టు 7న జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ కారును (టీఎస్ 18ఏ 0505) ను ఆపి కారు నడిపిస్తున్న యువకుడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.
దీంతో కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి వివరాలు సేకరించారు. తన పేరు నరాల లలిత్ వరప్రసాద్ అని తండ్రిపేరు నరాల వీరేందర్ అని చెప్పిన యువకుడిపై కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు నరాల లలిత్ వరప్రసాద్కు సమన్లు పంపించారు.
అయితే సమన్లు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులకు అతడి పేరు లలిత్ వరప్రసాద్ కాదని, తండ్రి పేరు కూడా తప్పని తేలింది. అతడి పేరు నరాల సుహాస్ అని తండ్రి పేరు మహేష్కుమార్ అని తేలింది. ట్రాఫిక్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా పోలీసులను తప్పుదారి పట్టించినట్టు గుర్తించారు.
అంతేకాక తన బంధువైన లలిత్ వరప్రసాద్ పేరు చెప్పడంతో పాటు అతడి పేరుతో ఉన్న డాక్యుమెంట్లను అందించడం ద్వారా మోసానికి పాల్పడిన సుహాస్తో పాటు అతడికి డాక్యుమెంట్లు ఇచ్చిన వరప్రసాద్పై ఐపీసీ 419,420 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.