మెట్పల్లి రూరల్ : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో పడిన కారును పోలీసులు బుధవారం వెలికితీశారు. కారులో ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు మెట్పల్లి పట్టణానికి చెందిన పూదరి రేవంత్(31), గుండవేని ప్రసాద్(40)గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే..మెట్పల్లి పట్టణానికి చెందిన రేవంత్ తన సమీప బంధువు అయిన ప్రసాద్తో కలిసి టవేరా వాహనంలో సోమవారం అర్ధరాత్రి ఇంటి నుంచి బయలుదేరారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం మెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆచూకీ కోసం గాలించారు.
సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారంతో వెల్లుల్ల శివారులోని కాకతీయ కాలువలో పడినట్లు అనుమానించారు. పోలీసులు, ఎస్సారెస్పీ ఉన్నతాధికారులతో మాట్లాడి కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపివేయించారు. బుధవారం ఉదయం నీటి ప్రవాహం తగ్గడంతో కాలువలో టవేరా వాహనం కనిపించింది.
మెట్పల్లి సిఐ శ్రీను, ఎస్ఐ సదాకర్ క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీయించారు. వాహనంలో మెట్పల్లి పట్టణానికి చెందిన రేవంత్, ప్రసాద్ మృతదేహాలు లభ్యమయ్యాయి.