బడంగ్పేట : మద్యం సేవించి వచ్చి తరచూ వేధిస్తుండంతో తట్టుకోలేక బావను హత్యచేసిన అక్క తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన మీర్పేట పోలీస్ స్టెషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం పోలీస్ స్టెషన్ పరిధిలోని సత్యసాయినగర్ జిల్లెలగూడలో నివాసముంటున్న సరోజ (40), శ్రీను (21) అక్క తమ్ముళ్లు.
వీరిద్దరూ టైల్స్ వర్క్ చేస్తుంటారు. బావ వరుసైన చంపాపేట్కు చెందిన రెడ్యా (45) కూడా టైల్స్ వర్క్ చేస్తుంటాడు. గత పది సంవత్సరాలుగా సరోజతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ క్రమంలో ఆమె నివాసముంటున్న ఇంటికి తరచూ వస్తూ వెళ్తుండేవాడు. చిన్న చిన్న విషయాలకు ఆమెతో గొడవ పడుతుండేవాడు.
తాగి ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని, అనవసరంగా గొడవ పడుతున్నాడని సరోజ తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో శ్రీను అతన్ని పలుమార్లు హెచ్చరించి పంపించాడు. అయినా మళ్లీ మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. కాగా ఈ నెల 2న 11 గంటలకు మద్యం సేవించి వచ్చి మద్యం మత్తులో సరోజపై లైంగికదాడి చేయబోయాడు.
అప్పటికే అతని ప్రవర్తనతో విసిగిపోయిన వారు అడ్డుతొలగించుకోవాలని ముందే వేసుకున్న పథకంలో భాగంగా ఇంటి తలుపులు మూసి చపాతి కర్రతో తలపై పలుమార్లు బాదారు. దీంతో తలకు తీవ్ర రక్తస్రావం అయి అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని హస్తీనాపురం లోని నవీన హస్పిటల్లో చేర్పించారు.
కింద పడిపోయి తలకు గాయమైందని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అతన్ని గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ 5న రాత్రి 12 గంటలకు మృతి చెందాడు. మృతుని కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్కు తరలించారు.