Delhi Accident | ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, అదే విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కాగా, శవపరీక్షలో మరిన్ని భయానక విషయాలు వెల్లడయ్యాయి.
అంజలి శరీరంపై 40కి పైగా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. యువతి శరీరం వెనుక భాగం ఛిద్రమైందని, దీంతో పక్కటెముకలు బయటకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తలభాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నాయి. వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదంతో షాక్కు గురవడం, తీవ్ర రక్తస్రావం వల్లే అంజలి మృతి చెందిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
ఈ నెల 1న తెల్లవారుజామున ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో స్కూటీలో వెళ్తున్న ఓ యువతిని ఢీ కొట్టిన కారు.. అనంతరం ఆమెను 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 ఏండ్ల వయసున్న అంజలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొత్త ఏడాది సందర్భంగా కొందరు స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న అంజలి.. అనంతరం నిధి అనే అమ్మాయితో కలిసి స్కూటీలో అక్కడి నుంచి బయలు దేరింది. దారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిపోయిన నిధి స్వల్పగాయాలతో అక్కడి నుంచి భయంతో ఇంటికి చేరింది. అయితే అంజలి మాత్రం కారు చక్రాల కింద పడి మృతి చెందింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిధిని గుర్తించిన పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేశారు.