బంజారాహిల్స్ : ఖరీదైన స్థలంపై ఫోర్జరీ పత్రాలను సృష్టించి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న వ్యవహారంలో పరారీలో ఉన్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన సయ్యద్ షకీల్ (58) ఈస్ట్మారేడ్పల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటాడు.
జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్కు చెందిన వల్లూరు చేతన్ సుశీల్ అనే వ్యక్తి కుటుంబానికి వంశపారంపర్యంగా విజయ వాడలోని ఎన్టీఆర్ కాలనీలో సుమారు 5400 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో ఇప్పటికే భవన నిర్మాణాలు చేపట్టారు. కాగా ఇటీవల సయ్యద్ షకీల్ అనే వ్యక్తి ఫోర్జరీ పత్రాలు సృష్టించాడు.
బల్కంపేటకు చెందిన గీతా అనే మహిళ వద్దనుంచి ఈ స్థలానికి తాను జీపీఏ చేసుకున్నానంటూ ప్రచారం చేయడం, వివిధ కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు చేతన్ సుశీల్ తదితరులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. గీతా అనే మహిళ ఎవరూ లేకున్నా ఆమె పేరుతో ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డును సృష్టించి సుమారు రూ.50కోట్ల విలువైన స్థలంపై వివాదాలు సృష్టించాడు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు కోర్టుల్లో తీర్పులు వచ్చినా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించుకునేందుకు స్కెచ్ వేసిన సయ్యద్ షకీల్ మరోసారి స్థలంలోని ఇండ్లలో ఉన్న వారికి బోగస్ నోటీసులు పంపించారు. దీంతో తమను బెదిరింపులకు గురిచేయడంతో పాటు డబ్బులు దండుకునేందుకు తప్పుడు పత్రాలను సృష్టించాడంటూ చేతన్ సుశీల్ మార్చి నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు నిందితుడు సయ్యద్ షకీల్తో పాటు అతడికి సహకరించిన అతడి కుమార్తె సయేదా సుల్తానా, దాసరి నరేంద్ర, దుక్కిపాటి నరేందర్తో పాటు మరికొంతమందిపై ఐపీసీ 406,420,468,471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సయ్యద్ షకీల్ను మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.