పెద్దఅంబర్పేట, మే 13 : ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట పెద్ద శివాలయం దగ్గర నివసించే చావగని మురళి (37) ఐస్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
గురువారం అర్ధరాత్రి తర్వాత అబ్దుల్లాపూర్మెట్లోని ఐస్ ఫ్యాక్టరీకి బైక్పై బయలుదేరాడు. 65వ జాతీయరహదారిపై వెళ్తుండగా ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట సంపూర్ణ హోటల్ దాటగానే ముందు వెళ్తున్న కంటైనర్ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ముందున్న కంటైనర్ను బైక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మురళి తలకు బలమైన గాయాలయ్యాయి. నోరు, ముక్కు నుంచి రక్తం కారి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి సోదరుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.