బెంగళూరు: ఒక వ్యక్తికి వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టి, రూ.5 లక్షలకుపైగా దోచుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 50 ఏండ్ల వ్యక్తికి గత రెండు ఏండ్లుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి అప్పుడప్పుడు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు వచ్చేవి. అక్టోబర్ 8న కూడా గుడ్ మార్నింగ్ మెసేజ్తోపాటు ఒక మహిళ పేరుతో లొకేషన్ కూడా ఆయన వాట్సాప్కు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి వీరన్నపాళ్యంలోని హోటల్లో ఆమెను కలిసేందుకు వెళ్లాడు.
అయితే హోటల్ గదిలో ముగ్గురు వ్యక్తులు ఉండటం చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. మరోవైపు తాము పోలీసులమని ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పారు. ఆ వ్యక్తిని మాదక ద్రవ్యాల వ్యాపారిగా ఆరోపించారు. అతడి పర్సు, క్రెడిట్ కార్డులను తీసుకున్నారు. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ను బలవంతంగా అన్లాక్ చేయించారు. అనంతరం అతడ్ని ఆ హాటల్ గదిలో ఉంచి లాక్ చేసి వెళ్లిపోయారు.
ఎలాగోలా బయటపడిన ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తన ఖాతా నుంచి రూ.3,91,812 బదిలీ అయినట్లు గుర్తించాడు. అనంతరం పలు దఫాలుగా మరో రూ.2 లక్షలు వేరే ఖాతాలకు బదిలీ అయినట్లు మెసేజ్లు వచ్చాయి.
దీంతో ఆందోళన చెందిన ఆ వ్యక్తి, గోవిందపుర పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తనకు జరిగిన మోసం గురించి ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.