భోపాల్ : అన్నెం పుణ్యం ఎరుగని ఓ పసి బాలుడిని పని మనిషి చిత్రహింసలకు గురి చేసింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తీవ్రంగా కొట్టేది. దీంతో ఆ బాలుడి పేగుల్లో వాపులు వచ్చాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వెలుగు చూసింది.
జబల్పూర్కు చెందిన ఓ ఇద్దరు దంపతులు ఉద్యోగం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే వారి రెండేండ్ల బాబును చూసుకునేందుకు రజనీ చౌదరి(30) అనే మహిళను నియమించుకున్నారు. అయితే అతడి ఆలనాపాలనా చూడాల్సిన రజనీ.. అవన్నీ మర్చిపోయి క్రూరంగా ప్రవర్తించేది. రోజు దారుణంగా కొడుతూ.. చిత్రహింసలకు గురి చేసేది. బాలుడి జుట్టుపట్టుకుని లాగుతూ.. చితక్కొట్టేది. దీంతో బాలుడు రోజురోజుకు బలహీనంగా మారిపోయాడు. గత నాలుగు నెలల నుంచి సైలెంట్గా ఉంటున్నాడు.
ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా, పేగుల్లో వాపు వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని పేరెంట్స్ డిసైడ్ అయ్యారు. అనంతరం కొద్ది రోజులకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, రజనీనే బాలుడిని రజనీ హింసించినట్లు బయటపడింది. రజనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.