ముంబై : క్రూయిజ్ డ్రగ్ పార్టీ కేసులో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్చిట్ ఇచ్చింది. ఆర్యన్పై ఆరోపణలకు తగిన ఆధారాలు లభించనందున అతడిని కేసు నుంచి తప్పించినట్టు ఎన్సీబీ తెలిపింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను గత ఏడాది అక్టోబర్లో అరెస్ట్ చేశారు. న్యాయస్ధానాల్లో వాదోపవాదాలు, 26 రోజుల పాటు కస్టడీ అనంతరం అక్టోబర్ 28న బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసింది.
ఆపై తన తండ్రి బర్త్డేకు ముందు అక్టోబర్ 30న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చాడు. క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీపై ఎన్సీబీ దాడుల్లో ఆర్యన్ ఖాన్ సహా 19 మందిని అరెస్ట్ చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయీల్ (37) గుండెపోటుతో మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ప్రభాకర్ తన నివాసంలోనే గుండెపోటుతో చనిపోయినట్టు అతడి తరఫు లాయర్ తుషార్ ఖండారే వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదని లాయర్ చెప్పారు.