E-Scooter Fire | తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ హొసూర్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైంది. శనివారం జరిగిన ఈ ఘటనతో ఈ ప్రాంత వాసులు ఆందోళనకు గురయ్యారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీ సూపర్వైజర్గా పని చేస్తున్న ఆ స్కూటర్ యజమాని ప్రమాదం నుంచి బయట పడ్డారు. స్కూటర్ కింద నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గుర్తించిన సతీశ్కుమార్ పక్కకు దూకేశాడు. ఆ వెంటనే స్కూటర్ను మంటలు కమ్మేశాయి. దీంతో పక్కనుంచి వెళుతున్నవారు అప్రమత్తమై సతీశ్ను కాపాడారు. గతేడాదే సతీష్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేశాడు. ఎలక్ట్రిక్ స్కూటర్లలో అకస్మాత్తుగా మంటలు రావడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇటీవల వెల్లూరు జిల్లాలో గత నెలలో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో తండ్రీ కూతుళ్లు ఊపిరాడక మరణించారు. గత నెలలో తిరుచిరాపల్లి జిల్లా మనప్పరాయిలో ఎలక్ట్రిక్ టూ వీలర్కు నిప్పంటుకుంది. ఈ నెల ప్రారంభంలో తెలంగాణలో డిటాచబుల్ బ్యాటరీతో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఒక వ్యక్తి మరణించాడు.
ఇదే నెలలో తమిళనాడులోని అంబూర్లో ఒక వ్యక్తి తన ఈ-స్కూటర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 50 కి.మీ. ప్రయాణించిన తర్వాత స్కూటర్ నిలిచిపోతుందని ఫిర్యాదు చేసినా ఉత్పత్తిదారులు పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి కోపంతో ఈ-స్కూటర్ తగులబెట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరలైంది.