లక్నో: ప్రేమికులైన హిందూ యువతి, ముస్లిం యువకుడు తమ ఇళ్ల నుంచి పరారయ్యారు. ఆగ్రహించిన హిందూ సంఘం సభ్యులు ముస్లిం వ్యక్తి ఇంటికి నిప్పుపెట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. జిమ్ ఓనర్ సాజిద్, 22 ఏండ్ల హిందూ యువతి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఈ నెల 11న వారిద్దరూ తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో తమ కుమార్తెను సాజిద్ కిడ్నాప్ చేసినట్లు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ధరమ్ జాగరణ్ సమన్వయ్ సంఘ్ సభ్యులు శుక్రవారం ఆగ్రాలోని రుంకుట ప్రాంతంలో సాజిద్ ఇంటితోపాటు పక్కనే ఉన్న అతడి కుటుంబానికి చెందిన మరో ఇంటికి నిప్పుపెట్టారు. అంతేగాక స్థానికంగా షాపులను కూడా బలవంతంగా మూయించారు.
కాగా, ఈ ఘటనపై ఆగ్రా సీనియర్ ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాజిద్ ఇంటికి నిప్పుపెట్టిన హిందూ సంఘం సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే స్థానిక పోలీస్ పోస్ట్ ఇంచార్జ్ను సస్పెండ్ చేశారు. సికంద్రా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించారు.
మరోవైపు రెండు రోజుల కిందట హిందూ యువతి వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. తాను మేజర్ అని, ఇష్ట పూర్వకంగానే ముస్లిం వ్యక్తితో కలిసి వెళ్లినట్లు అందులో పేర్కొంది. కాగా, ఆ యువతి ఉన్న ప్లేస్ను గుర్తించామని, ఆమెను తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. అయితే సాజిద్ ఆచూకీ ఇంకా తెలియలేదని చెప్పారు. వారిద్దరూ మేజర్లని, ప్రేమించుకుంటున్నారని పోలీస్ అధికారి వెల్లడించారు.