బెంగళూరు: ప్రియుడితో భార్య పారిపోయింది. మనస్తాపం చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెలను హత్య చేశాడు. మృతదేహాలను తన ఆటో సీటు కింద భాగంలో ఉంచాడు. రోజంతా ఆటో నడిపి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. మరునాడు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటకలోని కలబురగిలో ఈ దారుణం జరిగింది. వెదురు మార్కెట్లోని భోవి గల్లిలో నివాసం ఉండే 34 ఏళ్ల లక్ష్మీకాంత ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అంజలి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు.
కాగా, నాలుగు నెలల కిందట లక్ష్మీకాంత భార్య అంజలి తన రహస్య ప్రియుడితో పారిపోయింది. దీంతో లక్ష్మీకాంత మనస్తాపం చెందాడు. నాటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి పిల్లలు నానమ్మ వద్ద ఉంటున్నారు. అయితే లక్ష్మీకాంత మంగళవారం తన పిల్లల వద్దకు వెళ్లాడు. పదేళ్ల సోని, ఎనిమిదేళ్ల మయూరి అనే ఇద్దరు ఆడ పిల్లలను తన ఆటోలో పార్క్కు తీసుకెళ్లాడు.
అనంతరం ఇద్దరు కుమార్తెల గొంతునులిమి ఆటోలో హత్య చేశాడు. వారి మృతదేహాలను ఆటోలోని సీటు కింద దాచాడు. ఆపై ఆటోను నడిపి పలువురు ప్రయాణికులను ఎక్కించుకున్నారు. తాము కూర్చొన్న సీటు కింద ఇద్దరు ఆడ పిల్లల మృతదేహాలు ఉన్నట్లు ఆటోలో ప్రయాణించిన వారికి కూడా తెలియదు. అయితే లక్ష్మీకాంత బుధవారం మధ్యాహ్నం ఆటోలోని పిల్లల మృతదేహాలతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.