అహ్మదాబాద్: ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్య, కుమార్తెతో సహా బిల్డింగ్ 12వ అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. ఈ సంఘటనలో వారు అక్కడికక్కడే మరణించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ కులదీప్సింహ్ యాదవ్, అహద్మాబాద్లోని వస్త్రపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య రిద్ధి, మూడేళ్ల పాపతో కలిసి గోటా ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు.
అయితే ఆ దంపతులు తరచుగా గొడవ పడేవారని పొరుగువారు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కూడా కులదీప్సింహ్ యాదవ్, రిద్ధి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఉదయం 1.30 గంటలకు తొలుత భార్య రిద్ధి అపార్ట్మెంట్ బిల్డింగ్ 12వ అంతస్తు నుంచి కిందకు దూకింది. అనంతరం పోలీస్ కానిస్టేబుల్ యాదవ్, కుమార్తె అయిన మూడేళ్ల పాపను పట్టుకుని అక్కడి నుంచి కిందకు దూకాడు. ఆ ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు, పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అదే బిల్డింగ్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.