బెంగళూర్ : రేవ్ పార్టీలో పాల్గొన్న తన కుమారుడు సిద్ధాంత్ కపూర్ అరెస్ట్పై తనకేమీ తెలియదని బాలీవుడ్ నటుడు శక్తికపూర్ పేర్కొన్నారు. తనకూ మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందని, ఎవరూ ఫోన్కాల్స్కు స్పందించడం లేదని అసలేం జరిగిందో అర్ధం కావడం లేదని అన్నారు. కుటుంబ సభ్యులందరూ సిద్ధాంత్ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందడంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్లోని హోటల్పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్రగ్స్ తీసుకున్నారనే 35 మంది అనుమానితుల రక్త నమూనాలను పోలీసులు పరీక్షల కోసం పంపారు.
సిద్ధాంత్ కపూర్ సహా ఆరుగురి శాంపిల్స్ పాజిటివ్గా రావడంతో వారిని అరెస్ట్ చేశారు. వారు డ్రగ్స్ తీసుకుని హోటల్లో పార్టీకి హాజరయ్యారా లేక పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. శక్తికపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ 2020 వెబ్సిరీస్ భూకాల్తో పాటు షూటవుట్ ఎట్ వదాలా, అగ్లీ, హసీనా పర్కర్, చెహ్రే వంటి సినిమాల్లోనూ నటించారు.
భాగం భాగ్, చుప్ చుప్ కే, భూల్ భులైయ, ధోల్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గానూ పనిచేశారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణానంతరం ఎన్సీబీ బయటపెట్టిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా డ్రగ్స్ కేసుకు సంబంధించి 2020లో శక్తికపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, దీపికా పడుకోన్లను విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి చోటుచేసుకోలేదు.