బంజారాహిల్స్ : పీకలదాకా మద్యం సేవించడంతో పాటు ఇంటికి వెళ్లే దారి మర్చిపోయి బస్తీల్లో ర్యాష్డ్రైవింగ్ చేస్తూ వాహనాలను ఢీకొట్టిన సినీనటుడు దాసరి అరుణ్కుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 71లో నివాసం ఉంటున్న దాసరి అరుణ్కుమార్ బుధవారం సాయంత్రం ఇంటినుంచి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కు వెళ్లాడు.
సాయంత్రం దాకా అక్కడే షటిల్ అడిన అరుణ్కుమార్ తన స్నేహితుడు ప్రశాంత్తో కలిసి రాత్రి 8నుంచి 11గంటల దాకా అక్కడే పీకల దాకా మద్యం సేవించాడు. రాత్రి 11 తర్వాత క్లబ్ మూసేయడంతో తన స్విఫ్ట్ కారు (ఏపీ 39సీయూ 7007)లో ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు.
అపోలో చౌరస్తానుంచి నేరుగా వెళ్లాల్సిన అరుణ్కుమార్ కుడివైపుకు యూటర్న్ తీసుకుని బంజారాహిల్స్ రోడ్ నెం 12 వైపుకు వెళ్లాడు. మితిమీరిన వేగంతో కమాన్లోనుంచి సయ్యద్ నగర్ బస్తీవైపుకు వెళ్లాడు. దారిలో రోడ్డుపక్కన పార్క్ చేసిన బైక్లను ఢీకొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కొంతదూరం వెళ్లాక కారును ఆపడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు కారు నడిపిస్తున్న దాసరి అరుణ్కుమార్ను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.
బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 405బీఏసీ పాయింట్స్గా తేలింది. ర్యాష్ డ్రైవింగ్తో కారు నడిపిస్తూ తమ వాహనాలను ఢీ కొట్టిన అరుణ్కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్ అఫ్జల్ అలీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీసీ 279,336, మోటార్ వెహికల్ యాక్ట్ 185 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.