వెంగళరావునగర్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని మగ్గం పనిచేసే కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా నారెపల్లికి చెందిన మహ్మద్ సోహెల్ (28) అమీర్పేటలోని కె.వి.ఎస్ ఎంబ్రాయిడరీ సెంటర్లో మగ్గం పని చేస్తున్నాడు.
ఎంబ్రయిడరీ కేంద్రం యజమాని అర్.సాగర్కుమార్ పేయింటింగ్ పని ఉందని మహ్మద్ సోహెల్ను సుచిత్రలోని గోదావరి హోమ్స్కు రమ్మని కబులు పెట్టాడు. ఆదివారం ఉదయం సుచిత్రకు వెళ్లిన సోహెల్ అదే రోజు రాత్రి తన బైక్ పై తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డాడు. అర్థరాత్రి 2 గంటలకు ఎర్రగడ్డ లోని మెట్రో స్టేషన్ పిల్లర్ నెం.970 వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
దీంతో సోహెల్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సోహెల్ మామ మహ్మద్ యూసుఫ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.