నల్లగొండ : నల్లగొండ పట్టణంలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతిపై దాడి చేసిన యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన రోహిత్(21) అనే యువకుడు ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదవుతున్నాడు. అయితే నవ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో రోహిత్ వేధింపులకు గురి చేస్తున్నాడు. రోహిత్ ప్రేమ ప్రతిపాదనను గత ఏడు నెలల నుంచి నవ్య తిరస్కరిస్తూ వచ్చింది.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో నవ్య తన ఫ్రెండ్ శ్రేష్ఠతో కలిసి స్థానికంగా ఉన్న ఫారెస్ట్ పార్కుకు వచ్చింది. ఆ పార్కులో సాయి అనే ఫ్రెండ్తో నవ్య, శ్రేష్ఠ మాట్లాడుతుండగా.. రోహిత్ కూడా అక్కడికి చేరుకున్నాడు. నవ్యతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి.. పార్కులోనే మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు రోహిత్. ఇక తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
అనంతరం రోహిత్ తన బైక్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సాయి, శ్రేష్ఠ కలిసి నవ్యను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.