రంగారెడ్డి : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో దారుణం జరిగింది. ఓ యువతి ఇంటిపై 100 మంది యువకులు దాడి చేశారు. అనంతరం తల్లిదండ్రులను చితకబాది, ఇంటిని ధ్వంసం చేసి, ఆ యువతిని ఎత్తుకెళ్లారు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతలోపే అక్కడ్నుంచి యువకులు పరారీ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. రాగన్నగూడకు చెందిన ఓ యువతి ఇటీవలే బీడీఎస్(దంత వైద్యురాలు) పూర్తి చేసింది. దీంతో ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే నవీన్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఐదారు నెలలుగా ఆ యువతిని ప్రెమించానని, పెళ్లి చేసుకుంటానని ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తున్నది. మధ్యవర్తుల ద్వారా కూడా యువతి తల్లిదండ్రులను పెళ్లి సంబంధం గురించి అడిగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఈ సంబంధం తమకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. ఇది మనసులో పెట్టుకుని నవీన్ ఈ కిడ్నాప్కు ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది.
పెళ్లి చేసుకోవడానికి యువతి తల్లదండ్రులు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న నవీన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నవీన్పై షీటీమ్కు కూడా ఫిర్యాదు చేసినట్లు యువతి తండ్రి తెలిపారు. తమ కూతురును నవీన్ రెడ్డి అనే యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో ఇవాళ యువతిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారన్న విషయం నవీన్ రెడ్డికి తెలిసింది. దీంతో ఈ పెళ్లి సంబంధం చెడగొట్టాలనే అక్కసుతో ఏకంగా 100 మంది యువకులను నవీన్ రెడ్డి వెంటేసుకుని వచ్చాడు. యువతి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారిపై కూడా దాడి చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.