బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడడంతో పాటు ఇదేంటని నిలదీసినందుకు అతడి సోదరుడిని కూడా చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
టోలీచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ అబ్రార్ హుస్సేన్ అనే యువకుడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తుంటాడు. ఈ నెల 13న తనవద్ద పనిచేస్తున్న ఓ వర్కర్కు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉండగా తన తమ్ముడు సయ్యద్ అలీ హుస్సేన్కు రూ.45వేలు ఇచ్చి పంపించాడు.
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సయ్యద్నగర్లోని చిల్లా వద్దకు రాగానే రోడ్డుమీద తిష్టవేసిన ఆరుగురు యువకులు అలీ హుస్సేన్ను అటకాయించారు. అకారణంగా దూషించడంతో పాటు చేయి చేసుకున్నారు. దాంతో అలీ హుస్సేన్ జరిగిన విషయాన్ని అన్న అబ్రార్ హుస్సేన్కు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో స్నేహితుడు సోహైల్తో కలిసి అక్కడకు చేరుకున్న అబ్రార్ హుస్సేన్ వారిని ప్రశ్నించారు. దీంతో ఆ ఆరుగురు యువకులు అబ్రార్తో పాటు సొహైల్పై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవలో తన తమ్ముడివద్ద ఉన్న రూ.45 వేల నగదు మాయమయిందని అబ్రార్ హుస్సేన్ పోలీసులకు తెలిపాడు.
అలాగే తమపై దాడి చేసిన ఇర్ఫాన్, అక్బర్, ఒబెయిద్, అర్భాజ్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం అబ్రార్ హుస్సేన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.