తూప్రాన్ : వాహనాలు తనిఖీ చేస్తున్న ఓ హోంగార్డుపై ద్విచక్ర వాహనదారుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో మంగళవారం చోటు చేసుకుంది. తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు.
ఈ క్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీ పరిధికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. వాహనానికి సంబంధించిన పత్రాలు చూపకపోగా, మద్యం మత్తులో ఉన్న మల్లేష్ తన దగ్గర ఉన్న గొడ్డలితో హోంగార్డు షేక్ అఫీజ్ తలపై దాడి చేసి, అక్కడి నుండి పారిపోయేందుకు యత్నించాడు.
అప్రమత్తమైన పోలీసులు అఫీజ్ను అదుపులోకి తీసుకున్నారు. అఫీజ్ తలకు తీవ్ర రక్తస్రావమైంది. అఫీజ్ను హుటాహుటిన తూప్రాన్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం హోంగార్డు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.