ముంబై : పదవీ విరమణ పొందిన ఓ ఆర్మీ ఉద్యోగి తన భార్య, కూతురిని కత్తితో గొంతు కోసి చంపాడు. 12 గంటల పాటు శవాల మధ్యే ఉన్నాడు. అనంతరం తన పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి.. విషయాన్ని చెప్పాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
పురుషోత్తం సింగ్ గంధోక్ అనే వ్యక్తి ఆర్మీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. తన భార్య(81), కూతురు(55)తో కలిసి ఓ అద్దె గదిలో పురుషోత్తం ఉంటున్నాడు. భార్య గత పదేండ్ల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆమె మంచానికే పరిమితమైంది. ఇక కూతురు పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా, ఆమె కూడా అంధేరిలోని నివాసముంటోంది.
అయితే భార్య, కూతురిని చూసుకోవడం కష్టంగా మారిందని, అందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు పురుషోత్తం తన పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె తండ్రి వద్దకు రాగా, ఇంటి తలుపులు తెరిచేందుకు నిరాకరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి.. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తంను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తానే ఇద్దరిని చంపినట్లు పురుషోత్తం అంగీకరించాడు.