వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి
సూర్యాపేట టౌన్, మే 24 : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని, ప్రాణాలకు తెగించి వైద్యులు, నర్సులు, పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో కరోనా వార్డును ఆయన సందర్శించారు. సూర్యాపేటకు మెడికల్ కళాశాల రావడం ఇక్కడి ప్రజల అదృష్టమని.. పేట మెడికల్ కళాశాలలో పీజీ కోర్సులతోపాటు దవాఖాన 950 పడకలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని కోరారు.