జారంజక పథకాలు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని మరోసారి రుజువైంది. ఇటీవల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్, తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఏడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించింది. దుబ్బాక ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల పెరుగుదల గెలుపువాటమేనని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. కేంద్రం తెలంగాణ పట్ల అవలంబిస్తున్న వివక్షకు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. తామంతా తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ వెంటే నడుస్తామని గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నూతనంగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలలో ఓటు ద్వారా ప్రజలు తమ తీర్పునిచ్చారు.
రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన పట్టణంగా సిద్దిపేట అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందింది. సిద్దిపేట జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు సీపీ కార్యాలయం ఏర్పాటైంది. దేశానికే రోల్ మోడల్గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అదనంగా మున్సిపాలిటీకి మరో వెయ్యి ఇండ్లు మంజూరయ్యాయి. కోమటి చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు.
రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 126 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 91, కాంగ్రెస్ 14, బీజేపీ కేవలం 11 స్థానాల్లో గెలుపొందాయి. 5 మున్సిపాలిటీల్లో మొత్తం 122 వార్డులకు గాను 90 టీఆర్ఎస్, 15 కాంగ్రెస్, 4 బీజేపీ గెలుపొందాయి. అన్ని స్థానాల్లోనూ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ గెలుచుకున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సోషల్ ఇంజినీర్లా ఆలోచించి దశాబ్దాల కాలం నుంచి అరకొర అవకాశాలు పొందుతున్న మహిళలను ప్రోత్సహించేలా 14లో 10 పదవులు మహిళలకే కేటాయించడం అందులోనూ బడుగు, బలహీనవర్గాలు, మైనారిటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక న్యాయం, లింగ సమానత్వం, అట్టడుగువర్గాల అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
గ్రేటర్ వరంగల్ గురించి ప్రస్తావించాలి అంటే తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధి చెందుతున్నది. గ్రేటర్ హోదాను సాధించుకోగలిగింది. ఐటీ పార్క్ నిర్మాణం, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. గ్రేటర్లో వరదల సమయంలో కేటీఆర్ స్వయంగా పరిస్థితిని సమీక్షించి భరోసా ఇవ్వడమే కాక అక్రమ నిర్మాణాల కూల్చివేత, నాలాల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తులను గుర్తించడం, వరద సాయం, ఎంజీఎం దవాఖాన నవీకరణ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసేలా చేశాయి. ఓడిపోయిన స్థానాల్లోనూ సమన్వయ లోపమే. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి గణనీయంగా కనపడుతున్నది. బీటీ రోడ్ల విస్తరణ, ఐటీ పార్క్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, నూతన భవన సముదాయాల నిర్మాణం సమీకృత మార్కెట్ నిర్మాణం నూతన బస్టాండ్ నిర్మాణం వంటి అంశాలు, ఓటర్లను ప్రభావితం చేశాయి.
రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన పట్టణంగా సిద్దిపేట అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందింది. సిద్దిపేట జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు సీపీ కార్యాలయం ఏర్పాటైంది. దేశానికే రోల్ మోడల్గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అదనంగా మున్సిపాలిటీకి మరో వెయ్యి ఇండ్లు మంజూరయ్యాయి. కోమటి చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇటీవల నెక్లెస్ రోడ్డు, పార్కు తదితర పనులు చేపట్టారు. పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణ ప్రధాన రహదారులకు ఇరువైపులా పుట్పాత్ లు, ఎల్ఈడీ లైట్లు, ప్రధాన కూడళ్లను ఆధునీకరించారు. సుడా, రంగనాయక రిజర్వాయర్, ఐటీ టవర్, స్వచ్ఛ బడి, ఆక్సిజన్ పార్క్, వైకుంఠధామాలు, హరితహారం, నర్సరీలు, అధునాతన హంగులతో ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు, వీధి వ్యాపారులకు దుకాణ సముదాయాలు, మెడికల్ కళాశాల, విపంచి ఆడిటోరియం, జయశంకర్ స్టేడియం నిర్మా ణం వంటి అభివృద్ధికి సిద్దిపేట ప్రజలు పట్టం కట్టారు. గత పదేండ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్న అచ్చంపేట మున్సిపాలిటీ సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించింది.
నూతన మున్సిపల్ చట్టం ఏర్పాటు సమయంలో 76గా ఉన్న మున్సిపాలిటీలను 143 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగం గానే జడ్చర్ల మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అనతికాలంలోనే ఇక్కడ 60 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు, రోడ్ల విస్తరణ, 2 మినీ ట్యాంక్బండ్, 20 పార్కులు, వంద పడకల దవాఖాన, 1500 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వంటివి జడ్చర్ల సాధించగలిగింది. నల్గొండ జిల్లా నకిరేకల్ సైతం నూతన మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఇక్కడ దవాఖాన నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రోడ్ల విస్తరణ, అర్బన్ పార్క్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఆ గ్రామ రూపురేఖలను మార్చివేసింది. ఈ అభివృద్ధిని చూశారు కాబట్టే, ప్రజలు ఇంత భారీ మెజారిటీతో టీఆర్ఎస్కు పట్టం కట్టారు.
పట్టణాల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. వ్యక్తులు, వ్యవస్థల సమన్వయంతో ప్రతి పట్టణం ఒక మోడల్ పట్టణంగా రూపుదిద్దుకుంటున్నది. ఆ కృషి ఫలితంగానే ఈ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి అద్భుత విజయం సాధించగలిగింది.
(వ్యాసకర్త: డీన్, అకడమిక్ ఆడిట్, కాకతీయ యూనివర్సిటీ)
ప్రొఫెసర్
తాటికొండ రమేశ్