రాంచి: జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భూమ్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్యచేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సింగ్భూమ్ జిల్లాలోని కెండపోసి గ్రామంలో ఒనాము ఖండైట్ అనే వ్యక్తి తన భార్య మణి, తమ్ముడు గొబ్రూ, మైనర్ అయిన కొడుకుతో కలిసి నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం ఆ నలుగురు తమ పంటపొలాల్లోనే శవాలయ్యారు. ఉదయం పొలంవైపు వెళ్లిన గ్రామస్తులకు నలుగురూ విగతజీవులుగా పడి కనిపించారు. కుటుంబంలోని నలుగురినీ గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికిచంపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి హత్యలకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భూతగాదాలే హత్యలకు కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు.