ముంబై: తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి డిమాండ్ చేసింది. దీంతో స్నేహితుడు కేబుల్ వైర్తో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. వెర్సోవా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల సోనమ్ శ్రీకాంత్ శుక్లా, 22 ఏళ్ల సాబిద్ అన్సారీ చిన్ననాటి స్నేహితులు. కాగా, సోనమ్ నుంచి రూ.5,000 అన్సారీ తీసుకున్నాడు. ఏప్రిల్ 25న ఆమె అన్సారీ ఇంటికి వెళ్లింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.
దీంతో అన్నారీ రెండు వేలు తిరిగి ఇచ్చాడు. అయితే మొత్తమంతా తిరిగి ఇవ్వాలని సోనమ్ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన అన్సారీ కేబుల్ వైర్ను ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఒక సంచిలో వేసి ఆ కేబుల్ వైర్తో కట్టాడు. స్నేహితుడికి ఫోన్ చేసి బైక్ తీసుకుని రమ్మని చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని మాద్ బీచ్ వద్ద పడేశాడు.
కాగా, బీచ్ వద్ద సంచిలో యువతి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడు అన్సారీని గుర్తించి శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సిరాజ్ ఇనామ్దార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.