సూర్యాపేట, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో మాదిరి ఈ సారి కూడా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో పాటు రవాణా చార్జీలు కూడా తగ్గుతుండడంతో రైతుల ఆనందం చెప్పనలవి కాకుండా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేటలో 316, నల్లగొండలో 366 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధ్దం చేయ గా ఇప్పటి వరకు సూర్యాపేటలో 314, నల్లగొండలో 281 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్, మూసీ నదులు ఉండగా ఇక్కడి రైతులు ఇతర ప్రాంతాల కంటే ముందు సాగు చేస్తుండడంతో సూర్యాపేట జిల్లాలో ధాన్యం ముందు రావడం… ఆ మేరకు కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ప్రారంభమయ్యాయి.
1.14 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కలిపి కొనుగోళ్లు ప్రారంభమైన 14 రోజుల్లో ఇప్పటి వరకు 1,14, 244 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 6,128 మంది రైతుల నుంచి రూ.108.79 కోట్ల విలువ చేసే 57,628 మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాలో 7,129 మంది రైతుల నుంచి రూ.106.89 కోట్ల విలువ చేసే 56, 616 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో సూర్యాపేట జిల్లాలో ఐకేపీ కేంద్రం ద్వారా 29,429 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ద్వారా 28,198 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. నల్లగొండ జిల్లాలో ఐకేపీ సెంటర్ల నుంచి 28,604, పీఏసీఎస్ ద్వారా 29,012 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే 51,717 మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాలో 55,204 మెట్రిక్ టన్ను ల ధాన్యం ఆయా మిల్లులకు రవాణా పూర్తయింది.
ఖాతాలో డబ్బు జమ
సూర్యాపేట జిల్లాలో 16 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాగా నల్లగొండ జిల్లాలో 6.47 కోట్లు జమయ్యాయి. కొనుగోళ్లు ప్రారంభమైన వెంటనే కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడంతో పాటు వరుస సెలవుల కారణంగా ట్యాబ్లలో ఎంట్రీ చేయడం కాస్త ఆలస్యమైందని అధికారులు చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో ట్యాబ్ ఎంట్రీ అప్డేట్ పూర్తవుతుందని వెనువెంటనే డబ్బులు కూడా రైతుల అక్కౌంట్లలో జమ కానున్నాయి.
నిధులకు కొరత లేదు
జిల్లాలో అవసరం ఉన్న ప్రతి చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేస్తాం. నిధులకు ఎలాంటి కొరత లేదు. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో సుమారు 106 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా 16 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. రెండు, మూడు రోజుల్లో 70శాతం మంది రైతులకు డబ్బులు బదిలీ అవుతాయి. రైతులు తమ ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి.
-మోహన్రావు,అదనపు కలెక్టర్, సూర్యాపేట
డబ్బులు వెంటనే వచ్చినయ్..
మఠంపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించాను. మంచి రేటు వచ్చింది. కంప్యూటర్ కాంటాపై ధాన్యం కాంటా వేశారు. బస్తాకు కిలో మాత్రమే తరుగు తీశారు. డబ్బులు వెంటనే వచ్చాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు. 10 ఎకరాల్లో సాగు చేయగా 350బస్తాల దిగుబడి వచ్చింది.
-సమ్మిడి మట్టారెడ్డి, రైతు, మఠంపల్లి
కొనుగోలు కేంద్రంలోనే అమ్మిన..
మాది మునగాల మండలం తాడ్వాయి గ్రామం. నాకు 3.5ఎకరాల భూమి ఉంది. యాసంగిలో మొత్తం సాగు చేశాను. 1010రకం నాటు వేశాను. ఆరబెట్టిన ధాన్యా న్ని తాడ్వాయి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాను. తేమశాతం 17లోపే ఉండడంతో వెంటనే కొనుగోలు చేశారు. 310 టిక్కీలు అయ్యాయి. దళారులను ఆశ్రయించకుండా ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాను.
-వెంకట్రెడ్డి, రైతు, మునగాల