కోల్కతా: బిర్యానీ షాపులోని వ్యక్తులపై కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాక్పూర్లో ఈ సంఘటన జరిగింది. మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాక్పూర్ బరాసత్ రోడ్లోని ఫేమస్ బిర్యానీ షాపు వద్దకు సోమవారం మధ్యాహ్నం బైకుపై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బిర్యానీ షాపులోని వ్యక్తులపై తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి వారు పారిపోయారు. ఈ కాల్పుల్లో ఆ బిర్యానీ షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వారిద్దరిని వెంటనే బరాక్పూర్లోని బీఎన్ బసు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరికి ఛాతిలో, మరొకరికి చేతిపై బులెట్ గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతంలోని జనం ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బిర్యానీ షాపులో కాల్పుల ఘటనపై స్థానికులను ఆరా తీశారు. బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు బిర్యానీ షాపులోని వారిపై విచక్షణా రహితంగా ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షంగా చూసిన కొందరు పోలీసులకు చెప్పారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.