చెన్నై : కాలేజీ ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థినిని టీచర్లు కులం పేరుతో దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణంలో వెలుగు చూసింది.
ఎస్సీ కులానికి చెందిన సుభాషిణి(19) ఓ ప్రయివేటు కాలేజీలో ఫిజియోథెరపీ కోర్సును అభ్యసిస్తోంది. అయితే ఆమె కాలేజీ ఫీజు చెల్లించలేదు. దీంతో తరగతి గదిలోనే సుభాషిణిని టీచర్ కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా క్లాస్ రూమ్ బయట నిల్చోవాలని సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు జరిగిన అవమానాన్ని భరించలేక సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది.
తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సుభాషిణిని దూషించిన టీచర్ను అరెస్టు చేసేంత వరకు డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించొద్దని తల్లిదండ్రులు కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సుభాషిణి ఆత్మహత్యను తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. క్యాంపస్ పార్కింగ్లో ఉన్న బస్సును ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కాలేజీ క్యాంపస్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.