భువనేశ్వర్ : కోతులను బస్తాల్లో కట్టేసి.. వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 బస్తాల్లో 15 కోతులను బంధించి తీసుకెళ్తుండగా, వాటిలో 10 వానరాలు ఊపిరాడక మృతి చెందాయి.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన రమేశ్ సింగ్(20), పుసల్ నాగరాజు(23) కలిసి, 15 కోతులను ఎనిమిది బస్తాల్లో కుక్కారు. ఇక ఓ వాహనంలో ఆ సంచులను వేసుకొని.. ఒడిశాలోని బెర్హంపూర్ ఏరియాకు బయల్దేరారు. జరదగడ ఏరియాలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఈ వాహనం నుంచి కోతుల అరుపులు వినిపించాయి. దాంతో ఆ వాహానాన్ని ఆపి, సంచులను పరిశీలించగా, 15 కోతులు కనిపించాయి. ఇందులో 10 చనిపోగా, మరో ఐదు కోతులను ప్రాణాలతో రక్షించారు. ఊపిరాడకనే కోతులు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఈ నేరం చేసినట్లు రమేశ్, నాగరాజు అంగీకరించారు. కోతులను ఒడిశా అడవుల్లో వదిలేసేందుకు వెళ్తున్నట్లు వారిద్దరూ ఒప్పుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.