శంభునిపేట కేంద్రంగా గంజాయి విక్రయాలు
ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
ప్రధాన నిందితుడిపై ఇప్పటికే పది ఠాణాల్లో కేసులు
వరంగల్ : వరంగల్లోని శంభునిపేట కేంద్రంగా గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడుతున్న ఓ ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకొని మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శంభునిపేట ప్రాంతానికి చెందిన తవిరి మధు అలియాస్ మనోజ్ రైళ్లల్లో సమోసాలు విక్రయిస్తూ తన మిత్రులైన హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన జిడి రాజు, హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన సౌందరరాజన్ మూర్తితో కలిసి గంజాయి రవాణా, విక్రయాలు నిర్వహిస్తున్నాడు. శంభునిపేట అడ్డాగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మధు ఇంటిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా ప్రధాన నిందితుడు మధుపై 2007 నుంచి సికింద్రాబాద్, సనత్ నగర్, చిలకలగూడ, లాలాగూడా, మియాపూర్, ఖమ్మం, పెద్దపల్లి, సుబేదారి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.