కాశీబుగ్గ, ఫిబ్రవరి 24 : వరంగల్ నగరం 14వ డివిజన్ సుందరయ్యనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్దురాలిను బండరాయితో కొట్టి బంగారు ఆభరణాలు అపహరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందరయ్యనగర్లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున ప్రవేశించారు. ఇంట్లో జాగిలాపు ఐలమ్మ(70) నిద్రిస్తుండగా ఒంటి పై ఉన్న నగలు తీసుకొని దాడి చేయడంతో మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న సీపీ రంగనాథ్, ఈస్ట్జోన్ డీసీపీ కరుణాకర్, క్రైమ్ డీసీపీ మురళీధర్, పరకాల ఏసీపీ శివరామయ్య, ఏనుమాముల సీఐ చేరాలు ఘటనాస్థలిని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీపీ అధికారులను ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై పోగుల శ్రీకాంత్ తెలిపారు.
నర్సంపేట రూరల్ : నర్సంపేట మండలం లక్నెపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురి ఇళ్లలో ఏడుంబావు తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15 వేల నగదును అపహరించారు. డోలి సూరయ్య-సరోజన దంపతులకు కూతురుంది. కూ తురు సవిత వివాహం జరిపించారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో సూరయ్య మృతి చెందాడు. సరోజన కూలి పనులు చేస్తున్నది. వీరి ఇల్లు ఊరు చివరన ఉండడంతో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు దుండగులు ఇంటి వెనకాల ఉన్న తలుపును పగులగొట్టారు. ఇంట్లోకి ప్రవేశించి చంపుతామని బెదిరింపులకు గురి చేసి ఏడుంబావు తులాల బంగారం, 20 తులాల పట్టగొలుసులు, రూ.15 వేలు చోరీ చేశారు. దుండగులు ఫిరోజ్తో పాటు కాలనీలోని రాజులపాటి నగేశ్ ఇళ్లలో చోరీలకు విఫలయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న ఈస్ట్జోన్ డీసీపీ కరుణాకర్, నర్సంపేట, పరకాల ఏసీపీలు సంపత్రావు, శివరామయ్య, నర్సంపేట టౌన్ సీఐ పులి రమేశ్గౌడ్, ఎస్సైలు బొజ్జ రవీందర్, సురేశ్, తోట మహేందర్ బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. డాగ్ స్కాడ్, క్లూస్టీమ్తో వేర్వేరుగా విచారణ చేపట్టారు.
రాయపర్తి : రాయపర్తి మండలం కొండూరు శివారులోని శ్రీ విజయ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. గురువారం రాత్రి దుండగులు ఆలయం తాళాలు పగులగొట్టేందుకు యత్నించారు. కానుకల హుండీని ఎత్తుకెళ్లి సమీపంలోని వ్యవసాయ భూములలో తెరిచేందుకు యత్నించారు. వారి ప్రయత్నం సఫలం కాకపోవడంతో చేసేది లేక హుండీని ముళ్ల పొదల్లో పడేసి పారిపోయారు. దీనిపై స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశా రు. ఘటనాస్థలిని సర్పంచ్ కర్ర సరిత రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దేశబోయిన ఉపేందర్, వీరమనేని సత్యనారాయణరావు పరిశీలించారు.
దుగ్గొండి : వరంగల్- నర్సంపేట ప్రదాన రహదారిలోని చలపర్తి శివారులో దుండగులు బీభత్సం సృష్టించారు. చలపర్తి గ్రామానికి చెందిన నల్ల కమలాకర్రెడ్డి ఇంటికి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు వచారు. ఇంటి గేటు దూకగానే కమలాకర్రెడ్డి అప్రమత్తమై కేకలు వేశాడు. కుక్క మొరగడంతో దొం గలు పంటపొలాల నుంచి పారిపోయారు. కాగా ఇదే రహదారిలో జీడికల్ గ్రామానికి చెందిన సార నర్సయ్య ఇంటి ముందున్న అతడి కుమారుడు సార ప్రశాంత్కు చెందిన ద్విచక్రవాహనాన్ని దొంగలు అపహరించుకుపోయారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై నవీన్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రైమ్ డీసీపీ మురళీధర్, నర్సంపేట ఏసీపీ సంపత్కుమార్, దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్సైలు పిట్టల తిరుపతి, నవీన్కుమార్ చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ప్రత్యేక పో లీసు బృందాలతో గాలింపు చేపట్టారు.