కావల్సిన పదార్థాలు
చిలగడదుంపలు: నాలుగు
సగ్గుబియ్యం: కప్పు
అల్లం: మీడియం సైజ్ ముక్క
పచ్చిమిరపకాయలు: నాలుగు
కొత్తిమీర తరుగు: అరకప్పు
కరివేపాకు: గుప్పెడు
బియ్యప్పిండి: టేబుల్ స్పూన్
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి, కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత చెక్కు తీసి పక్కకు పెట్టుకోవాలి. మరోపక్క సగ్గుబియ్యాన్ని నీళ్లలో ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లను ఒంపేసి, ఆ సగ్గుబియ్యంలో ఇందాక ఉడకబెట్టుకున్న చిలగడ దుంపల ముక్కలను మెత్తగా మెదిపి వేయాలి. అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద చేసి పెట్టుకోవాలి. కరివేపాకును కడిగి సన్నగా తరగాలి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమంలో వీటి తరుగు, అల్లం పచ్చిమిర్చి ముద్ద, బియ్యప్పిండి, ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే సరి. ఇప్పుడు గుంత పొంగణాలు చేసే మూకుడును తీసుకొని ఆ గుంటల్లో కొద్దిగా నూనె రాసి ఈ మిశ్రమాన్ని నింపాలి. ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకొని మళ్లీ నూనె వేసి కాల్చుకోవాలి. బంగారు వన్నెలో వేగితే రుచికి బాగుంటాయి. వీటిని కొత్తిమీర కారం, టమాట సాస్లతో నంజుకుని తినొచ్చు!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు