ఏం కావాలి?
బాస్మతి బియ్యం: ఒక కప్పు, కూరగాయ ముక్కలు: ఒక కప్పు, పచ్చి బఠాణీలు: ఒక స్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, లవంగాలు: నాలుగు, మిరియాలు: ఆరు, యాలకులు: రెండు, బిర్యానీ ఆకులు: రెండు, సాజీర: అర టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ధనియాలపొడి, కారం: ఒక టీస్పూన్ చొప్పున, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్ చొప్పున, టమాటా: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత, ఫుడ్కలర్ (ఆరెంజ్, గ్రీన్): అర టీస్పూన్ చొప్పున.
ఎలా చేయాలి?
బాస్మతి బియ్యాన్ని కడిగి గంటపాటు నానబెట్టాలి. స్టవ్మీద గిన్నెపెట్టి నాలుగు కప్పుల నీళ్లు పోసి మసాలా దినుసులతో పాటు.. ఒక స్పూన్ నూనె, తగినంత ఉప్పు వేసి నీళ్లు మరుగుతుండగా బియ్యం వేసి సగానికి పైగా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడకకుండానే నీళ్లు వంపేయాలి. అన్నాన్ని మూడు భాగాలు చేసి ఒకదాంట్లో ఆరెంజ్, మరొక దాంట్లో గ్రీన్ కలర్ వేసి బాగా కలపాలి. స్టవ్మీద పాన్పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. బాగా వేగాక తరిగిన టమాటా జోడించి మగ్గించాలి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, తగినంత ఉప్పు, ఉడికించిన కూరగాయల ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి బాగా కలిపి అరగ్లాస్ నీళ్లు పోసి కాసేపు సన్నని మంటపై ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఒక గిన్నెలో కింద రెడ్ కలర్ కలిపిన అన్నం ఒక పొరలా వేసి పైనుంచి కూర, మళ్లీ వైట్ రైస్ లేయర్, తర్వాత కూర, చివరగా గ్రీన్ రైస్ వేసి బాగా అదిమి పళ్లెంలో బోర్లించాలి. పైనుంచి కొత్తిమీర తురుము చల్లితే చాలు.