కావలసిన పదార్థాలు
గోధుమపిండి, మైదాపిండి: ఒక కప్పు చొప్పున, గుడ్లు: నాలుగు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, టమాట ముక్కలు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: కొద్దిగా, పచ్చిమిర్చి: రెండు, పసుపు: చిటికెడు, ఉల్లిగడ్డ: ఒకటి, మిరియాల పొడి: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, నూనె: అర కప్పు.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదా, గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పావుగంటపాటు మూతపెట్టి పక్కనపెట్టాలి. ఒక గిన్నెలో గుడ్లు, సన్నగా తరిగిన టమాట, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీల్లా ఒత్తి పెనంపై వేసి ఒక నిమిషం పాటు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుని పక్కనపెట్టాలి. పెనం మీద నూనెవేసి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసి పైనుంచి కాల్చిన చపాతీ పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, నిమ్మరసం, చిటికెడు ఉప్పు, పసుపు, మిరియాలపొడి, కారం వేసి బాగా కలపాలి. కాల్చిన పరోటాల మధ్యలో ఆ మిశ్రమం పెట్టి గుండ్రంగా చుట్టుకుంటే ఎగ్ పరోటా రోల్స్ సిద్ధం.