కావలసిన పదార్థాలు
మటన్ కీమా: అర కిలో, ఆలు గడ్డలు: రెండు(పెద్దవి), నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి: ఎనిమిది, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: రెండు, గడ్డపెరుగు: పావుకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, ధనియాల పొడి: ఒకటిన్నర టీస్పూన్, గరం మసాల: ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, యాలకులు: రెండు, దాల్చిన చెక్క: చిన్న ముక్క, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
కడాయిలో నూనె వేడయ్యాక ఎండు మిర్చి వేయించాలి. వేగిన మిర్చిని పక్కన పెట్టి, అదే నూనెలో దాల్చిన చెక్క, యాలకులు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేయించుకోవాలి. దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ కీమా, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి పది నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. టమాట ముక్కలు, పెరుగు, చిన్నగా తుంచిన వేయించిన ఎండు మిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి నలభై నిమిషాలపాటు సన్నని మంటపై ఉడికించాలి. నూనె పైకి తేలాక తొక్కతీసిన ఆలుగడ్డ ముక్కలు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరిన్ని నీళ్లుపోసి మరో పావుగంటపాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి దించుకుంటే నోరూరించే ఆలూ కీమా సిద్ధం.