Janhvi Kapoor | ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న యువ కథానాయిక జాన్వీకపూర్ తన తల్లి దివంగత శ్రీదేవిని తలచుకొని భావోద్వేగానికి గురైంది. తొలి చిత్రం ‘ధడక్’ షూటింగ్ సమయంలో అమ్మను లొకేషన్కు రావొద్దని చెప్పానని, తన నిర్ణయం తప్పని కొంతకాలానికి అర్థం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ హిందీతో పాటు దక్షిణాదిలో కూడా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నది. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్నది.
జాన్వీకపూర్ మాట్లాడుతూ ‘మా అమ్మకు ఉన్న పేరుప్రతిష్టల కారణంగానే నాకు అవకాశాలు వస్తున్నాయని అందరూ అనుకునేవారు. అందుకే అమ్మను షూటింగ్ లొకేషన్కు రావొద్దని చెప్పాను. వారసత్వం తాలూకు ఎలాంటి ఛాయలు లేకుండా నా సొంతంగా ఎదగాలని ప్రయత్నించాను. అదే సమయంలో నాలో ఏదో తెలియని అభద్రతాభావం ఉండేది. అంచనాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఒత్తిడికి గురయ్యేదాన్ని.
అమ్మ ఎలాంటి సలహాలు ఇచ్చిన తీసుకునేదాన్ని కాదు. కొంతకాలం గడిచాక నా నిర్ణయాలు తప్పని తెలుసుకొని బాధపడ్డాను. ఇప్పుడు అమ్మ ఉంటే తనను షూటింగ్కు పిలిచి ఆనందంగా ఎన్నో విషయాలను పంచుకోవాలనిపిస్తున్నది. శ్రీదేవి కూతురిగా పుట్టినందుకు గర్విస్తున్నా’ అని జాన్వీకపూర్ చెప్పింది. ‘దేవర’ చిత్రంలో జాన్వీకపూర్..తంగమ్ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది.