Ranveer Singh | ‘కాంతార’ సినిమాలో రిషబ్ శెట్టి ప్రదర్శించిన అత్యంత పవిత్రమైన ‘వరాహ రూపం’ మరియు దైవ నర్తకుడి హావభావాలను అనుకరిస్తూ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ చేసిన ప్రదర్శనపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘కాంతార’ చిత్రంలో రిషబ్ శెట్టి నటనను మెచ్చుకునే క్రమంలో ‘పంజుర్లి’ దైవం హావభావాలను వేదికపై అనుకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక సంస్కృతిని, దైవ నర్తకుల మనోభావాలను అవమానించారంటూ ఒక న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కళాకారులకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రాంతీయ ఆచారాలు, నమ్మకాలను అపహాస్యం చేయడం సరికాదని పేర్కొంది. ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు ఎంతో సెంటిమెంట్ అయిన భూతకోల సంప్రదాయాన్ని కేవలం వినోదం కోసం వాడుకోవడం ఆమోదయోగ్యం కాదని హెచ్చరిస్తూ, రణవీర్ సింగ్ ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అయితే ఈ విచారణలో రణవీర్ సింగ్కు కోర్టు స్వల్ప ఊరటనిస్తూ, ప్రస్తుతం ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. కానీ తదుపరి విచారణకు నటుడు పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది. గతంలోనే ఈ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్.. రిషబ్ శెట్టి నటనలోని క్లిష్టతను చెప్పడం కోసమే తాను అలా చేశానని, తనకు అన్ని సంప్రదాయాల పట్ల గౌరవం ఉందని పేర్కొంటూ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని అప్పట్లోనే సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం, తాజాగా న్యాయమూర్తి ఆయన వైఖరిని తప్పుబడుతూ ఆదేశాలు జారీ చేయడంతో అటు సినీ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ తీరుపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.