ఫిరోజ్ ఖాన్, సనాఖాన్, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘యూ ఆర్ మై హీరో’. ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై మిన్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు షేర్. ఈ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…‘ఉమ్మడి రాష్ట్రంలో టాలీవుడ్లో తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడి నటీనటులు, సాంకేతిక నిపుణులు వివక్షకు గురయ్యారు. తెలంగాణ వచ్చాక వారికి అవకాశాలు పెరిగాయి.
మన భాషకు, సంస్కృతికి సినిమాల్లో చోటు దక్కుతున్నది. తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్లు చేసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో ప్రభుత్వం తరుపున కావాల్సిన సహకారాలు అందిస్తాం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారు. ‘మా చిత్రంలో రొమాన్స్, సస్పెన్స్, హారర్ అంశాలుంటాయి. దర్శకుడు అందరికీ నచ్చేలా చిత్రాన్ని రూపొందించారు. చిన్న నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతున్నది’ అని అన్నారు నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్.